టికెట్ల పంపిణీపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే తుది నిర్ణయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గాంధీ భవన్లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం అప్లికేషన్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.25వేలు, సాధారణ అభ్యర్థులకు రూ.50వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించామన్నారు. అయితే దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లించబడదన్నారు.ఈరోజు నుంచి దరఖాస్తుల కార్యక్రమం మొదలైందన్నారు. ఈ నెల 25 వరకు దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు.
ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుందన్నారు. పార్టీకి చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల నివేదిక తయారు చేస్తారని వెల్లడించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ధారించాకే అభ్యర్థులను ఫైనల్ చేస్తామని చెప్పారు. అప్పటివరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా ప్రకటించుకున్నా.. అవి ఊహాగానాలే అవుతాయని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
అభ్యర్థులు ఫైనల్ అయినట్లు మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దన్నారు. గతంలో హామీ ఇచ్చారని జరిగే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.