ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు నేడు జరుగుతున్న జనతా కర్ఫ్యూ విజయవంతం చేసేందుకు పోలీసు వ్యవస్థ తన శక్తి మేరకు ప్రయత్నిస్తున్నది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లో ఉండిపోవడం వల్ల జనతా కర్ఫ్యూ పూర్తిగా విజయవంతం అయింది. అయితే నిరుపేదలు, ఇళ్లులేని వారు, జీవనోపాధి లేని వారి పరిస్థితి ఏమిటి?
ఈ ప్రశ్న నుంచి మొదలైన గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసు సిఐ పి కృష్ణయ్య ఆదేశాల మేరకు 2 టౌన్ ఎస్ ఐ పఠాన్ రబ్బాని ఖాన్ పేదవారికి ఆహారం అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడి పిలుపు మేరకు దేశ ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొని ఇళ్లకే పరిమితం అయ్యారని అయితే రోజు వారి పనికి వెళ్లి కడుపు నింపుకొనే వారు మాత్రం కర్ఫ్యూ కారణంగా నష్టపోతారని భావించి ఈ చిన్న ప్రయత్నం చేసినట్లు ఎస్ ఐ పఠాన్ రబ్బాని ఖాన్ తెలిపారు.
కరోనాను ఎదుర్కొవాలనే సంకల్పంతో నిరుపేదలు కూడా స్వచ్ఛందంగా నిర్బంధంలో ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించిన గుంటూరు జిల్లా నరసరావుపేట 2 టౌన్ ఎస్ఐ, సిబ్బంది జనతా కర్ఫ్యూ కారణంగా ఇబ్బంది పడుతున్న అనాథలకు, వృద్ధులు, వికలాంగులు, బిచ్చగాళ్ళు ఆకలి బాధతో ఉండకూడదు అనే సదుద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టారు. ప్రజల పట్ల భద్రతే కాదు బాధ్యత కూడా పంచుకుంటాం అంటూ పేదలకు వాటర్ బాటిల్ బిస్కెట్లు పంపిణీ చేసి వారి ఆకలి తీరడంలో తమ వంతు సాయం అందించారు.