ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగచాటు నిధుల తరలించడంపై కేంద్రం నిఘా వేసినట్లే కనిపిస్తున్నది. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న పంచాయితీ నిధులను రెండు మార్లుగా లాగేసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇక అలాంటి అవకాశం లేకుండా చేస్తున్నది.
ఇప్పటికే 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్ బిల్లుల బకాయిల పేరిట రూ. 1300 కోట్లను ప్రభుత్వం లాగేసుకున్నది. మరోవైపు15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 944 కోట్లను వారం రోజుల క్రితమే పంచాయతీ అకౌంట్ల నుంచి ఆర్ధిక శాఖ మళ్లించుకున్నది.
దీంతో ఈ వరుసగా నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వానికి కుప్పులు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై కేంద్రం చాలా సీరియస్గా స్పందించింది. ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీ పేరిట ప్రారంభించాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం ఆదేశాలతో పంచాయతీ రాజ్ కమీషనర్ జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు ఇక నుంచి ఈ అకౌంట్లో వేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అకౌంట్లు గ్రామ పంచాయతీ పేరు మీద, యూనియన్ బ్యాంక్లో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇకపై అన్ని పంచాయతీలు వెంటనే అకౌంట్లు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై నిఘా పెట్టడం, నిధులను దొంగచాటుగా తరలించుకుంటున్నట్లు పసిగట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వానికి పరువు పోయినట్లు అయింది.