విశాఖ స్టీల్ పై ఏదో సాధిద్దామని వెళ్లిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందానికి బిజెపి అధిష్టానం చుక్కలు చూపించింది. సానుకూల స్పందన రావడం అటుంచి పెడసరం మాటలు ఎదురు కావడంతో సోము వీర్రాజు హతాశుడయ్యాడు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే సోము వీర్రాజు బృందాన్ని కలిసేందుకే ఇష్టపడలేదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి మూడు రోజులు అవుతోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీ హైకమాండ్ నుంచి కానీ కేంద్రమంత్రుల నుంచి ఎలాంటి హామీని పొందలేకపోయారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమైనప్పటికీ.. ఎలాంటి క్లారిటీ రాలే్దు.
జేపీ నడ్డాతో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించడానికి చాన్స్ కూడా ఇవ్వలేదు. పార్టీ పరమైన వ్యవహారాలపై మాత్రమే తనతో మాట్లాడాలని.. మిగతా విషయాలపై మంత్రుల్ని కలవాలని ఆయన మొహం మీదనే చెప్పినట్లుగా తెలుస్తోంది.
వీరెవరూ కాదు.. అమిత్ షాను కలిస్తేనే… ఏపీలో ప్రజలు కాస్తంత నమ్ముతారని అనుకుంటున్నారు. అందుకే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంత వరకూ ఖరారు కాలేదు. ఓ వైపు ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ఊపందుకుంటోంది.
మరో వైపు అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయా పార్టీల నేతలు వ్యతిరేకించడానికి బీజేపీ నేతలు వ్యతిరేకించడానికి స్పష్టమైన తేడా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తాము వ్యతిరేకించడం మాత్రమే కాదు.. ఆ నిర్ణయాన్ని ఆపాల్సిన బాధ్యత కూడా ఉంది.
కనీసం ప్రయత్నం అయినా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఏపీ బీజేపీ నేతలు… ఢిల్లీకి వెళ్లారు. కానీ వారికి అధిష్టానం షాక్ ఇచ్చేలా వ్యవహరించింది.