ఫోటో ఎలక్టోరోల్ రోల్ స్పెషల్ సమ్మరి రివిజన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో 2వ ఎస్ఎస్ఆర్-2023 పై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2వ ఎస్ఎస్ఆర్-2023 ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు.
ఇంటింటి తనిఖీలో వేగం పెంచాలన్నారు. 6గురి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ప్రతి ఇంటి తనిఖీ పూర్తి చేయాలన్నారు. పెండింగ్ దరఖాస్తుల క్షేత్ర పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆఫ్ లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు ఆన్లైన్ చేసి, సంబంధిత బూత్ స్థాయి అధికారికి క్షేత్ర పరిశీలనకు అందజేయాలన్నారు. ఎపిక్ కార్డుల ప్రింటింగ్ పురోగతిపై దృష్టి పెట్టాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిషిప్షన్, కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు.
స్వీప్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలని, నూతన ఓటర్ల నమోదు, నమోదైన ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకొనేలా అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. కళ్యాణలక్ష్మి/శాదిముబారక్ డాటా ప్రకారం నూతన వధువులు ఓటు హక్కు కలిగివున్నది లేనిది, ఉన్నవారు తమ అడ్రస్ మార్పు చేసుకున్నది లేనిది పరిశీలించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
గత ఎన్నికల్లో లో ఓటర్ టర్నోవర్ గల పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవోలు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, తహశీల్దార్లు, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.