చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల మరణించిన కట్టంగూరు ఏ.ఎస్.ఐ. ఎస్. వెంకన్న, ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ ఎం. మల్లేషం కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున చేయూత పథకం కింద ఎస్పీ చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఆయన చెప్పారు.
పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, రాష్ట్ర నాయకులు సోమయ్య, వెల్ఫేర్ ఆర్.ఐ. నర్సింహా చారి తదితరులున్నారు.