శ్రీశైలం దేవస్థానాన్ని కొల్లగొట్టిన సిబ్బందికి ఉచ్చు బిగుసుకుంది. 33 మంది ఉద్యోగులపై కేసులు నమోదు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. విచారణ పూర్తయ్యేంత వరకు 11 మంది దేవస్థాన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సుమారు 2.56 కోట్లను ఆలయ ఉద్యోగులు పక్కదారి పట్టించి నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా నిధులను పక్కదారి పట్టించిన ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
అలాగే విచారణ పూర్తయ్యేంతవరకు 11 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జె ఎస్ వి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం దేవస్థానం లో 2016 నుండి 2020 వరకు ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగుల తో పాటు ఆంధ్ర బ్యాంకు కు సంబంధించి పనిచేస్తున్న 20 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 2.56 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు.
ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన దేవస్థానానికి సంబంధించిన ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు ఏ ఈ ఓ లు రిటైర్డ్ అయిన మరో ఏఈవో పాటుగా మిగిలిన ఏడు మంది ఉద్యోగుల ను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈవో కె.ఎస్.రామారావు ను ఆదేశించారు. దుర్వినియోగం అయిన సొమ్మును రాబట్టేందుకు చర్యలు చేపట్టారు.