తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నిబద్ధమైన, సువ్యవస్థీతమై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు. 80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది సభ్యులతో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షతంగా తీర్చిదిద్దుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ
ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ సీఎం పేర్కొన్నారు.
దేశానికే రోల్మోడల్గా తెలంగాణ..
రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవర్నీ పట్టుకొని ఎడ్వాలో తెలువని పరిస్థితి అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అస్థిత్వమే ఆగమయైపోయే పరిస్థితి. ఒక దిక్కుతోచని సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిపడింది. అపజయాలు, అవమనాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.
అవార్డులు మన పనితీరుకు మచ్చుతునక..
కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు, అవార్డులు, రివార్డులే మన పనితీరుకు మచ్చుతునక అని కేసీఆర్ పేర్కొన్నారు. నిన్న విడుదల చేసిన ప్రకటనలో దేశంలో అతి ఉత్తతమైనటువంటి పది గ్రామాలు తెలంగాణవే నిలిచాయి. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. మన పనితీరుకు ఇది మచ్చుతునక అని చెప్పారు. కేంద్రం నుంచి అవార్డు రానటువంటి డిపార్ట్మెంట్ తెలంగాణలో లేదన్నారు. ఒక నిబద్ధమైన పద్ధతిలో, అవినీతిరహితంగా, చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నాం. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాళ జలభాండగారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ చానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి, సీతారామ పూర్తి చేసుకుంటే తెలంగాణలో కరువు ఉండనే ఉండదని స్పష్టం చేశారు.
అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు..
విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్న వేళలో వెలుగు జిలుగుల తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇది మన అంకిత భావానికి మంచి ఉదాహరణ. ఏ రంగంలో అయినా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం. ఎందరో మహానుభావులు, గొప్పవాళ్లు, పార్టీకి అంకితమై పని చేసే నాయకుల సమాహారమే ఈ ఫలితాలకు కారణం అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పని చేస్తున్నాం. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.