ఈ వర్షకాల పార్లమెంటు సమావేశల్లోనే ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వనపర్తి జిల్లా కన్వీనర్ రాజానగరం రాజేష్ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం వనపర్తిలో నేడు జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపిన ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అంశాన్ని సీరియస్ గా తీసుకోకపోతే వాల్మికులం కూడ మాదిగల పక్షాన ప్రత్యక్షంగా పోరాటం చేయాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నామని వాల్మీకి జేఏసీ కన్వీనర్ వెంకటయ్య నాయుడు తెలిపారు.
మాదిగలకు వర్గీకరణ చేస్తాం అని భారతీయ జనతా పార్టీ మొన్నటి వరకు నమ్మబలికి ఇప్పుడు మాదిగలను విస్మరించడం బీజేపీ పెద్దలకు తగదు అని గుర్తు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజవాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ ఈ వర్షాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాని యెడల సబ్బండ కులాలు వారి మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని రాజకీయంగా ఏదగనివ్వం అని తెలిపారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించాలని ఎస్సీ వర్గీకరణకు బిజెపి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. బీజేపీ పార్టీ 2014 ఎన్నికల్లో కేంద్రం లో అధికారంలోకి వస్తే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఉపకులాలన్నిటికీ జనాభా దామాషా ప్రకారం న్యాయం చేస్తామని చెప్పి వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాదిగలని నమ్మించి మోసం చేసింది బీజేపీ పార్టీ అని గుర్తు చేశారు.
ఎస్సి ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు మాదిగ మాట్లాడుతూ భారతదేశంలో బిజెపి చేయాలనుకున్న చట్టాలు ఏవైనా ఆగాయా అని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్, జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, 370 ఆర్టికల్ ,రామ మందిర్, అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లని కూడా రాష్ట్రాల అనుమతి లేకుండా ,ఏ రాజకీయ పార్టీలు అనుమతి లేకుండా, ఏకపక్షంగా బిజెపి పార్టీ చేసినప్పుడు, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ చేయమంటుంటే ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు.
వర్గీకరణకు అనుకూలంగా మూడు కమిషన్ల నివేదికలు కూడా కేంద్రంలో ఉంటే, వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ పార్టీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా బిజెపి పార్టీ పెద్దలు ఆలోచించి ఎస్సీ వర్గీకరణ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో పెట్టని పక్షంలో బిజెపి నాయకులను మాదిగ పల్లెలు వస్తే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సీనియర్ నాయకులు కొమ్ము చెన్న కేశవులు మాదిగ, ఏమ్మర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు చంద్రయ్య మాదిగ, ఏమ్మర్పియేస్ జిల్లా నాయకులు శ్రీకాంత్ మాదిగ, ఏమ్మర్పిఎస్ పానగల్ మండల కన్వీనర్ సిద్దు మాదిగ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్