అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని పూర్తిగా మరచిపోయినందుకు నిరసన వ్యక్తం చేయాలని APCPSEA నిర్ణయించింది.
ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసేందుకు సెప్టెంబర్ ఒకటో తేదీన కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద తలపెట్టిన పెన్షన్ విద్రోహ దినం నయవంచన సభ పోస్టర్లను నేడు వారు ఆవిష్కరించారు. కడప జిల్లా రాజంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆదివారం APCPSEA రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, సి.పి.యస్ ఉద్యోగులు రామ చంద్ర, రామకృష్ణ ,రమేష్, పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెండు లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాటను తప్పారా లేక పూర్తిగా మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. మాట తప్పని మడమ తిప్పని సీఎంగా సంపాదించుకున్న కీర్తి ఒట్టి ప్రచారం మాత్రమే అని అంటూ ఎద్దేవా చేశారు. సీపీఎస్ విధానం రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు.
పాత పెన్షన్ పునరుద్ధరణ కొరకు సెప్టెంబర్ ఒకటో తేదీ కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నయవంచన సభకు అన్ని శాఖల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్నాయక్ ,శ్రీనివాసులు, నాగార్జున, నవీన్, మస్తాన్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.