ఈనెల 27న గణేశ్ నిమజ్జనం పురస్కారించుకొని అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఖమ్మం నగరంలోని కాల్వవోడ్డు మున్నేరు, ప్రకాశ్ నగర్ మున్నేరు, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా వైపు మున్నేరు వద్ద జరిగే నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ ,పోలీస్ కమిషనర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో వుండేలా చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలను కంట్రోల్రూమ్కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు.
మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పోలీసులతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో సహకరించుకోవాని కోరారు.
ఏదైన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్థానిక పోలీస్ అధికారులకు, డయల్ 100కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు హరికృష్ణ, భస్వారెడ్డి, గణేష్, సారంగపాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.