జనాభా ప్రాతిపదికన అగ్రగామిగా ఉన్న ముదిరాజులకు వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ హలొ ముదిరాజ్.. చలో కామారెడ్డి అంటూ చేపట్టిన ధర్మయుద్దం ర్యాలీ విజయవంతం అయింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా ముదిరాజ్ సభ్యులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, ఇందిరా చౌక్, పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి తిరిగి నిజాంసాగర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. దాంతో ముదిరాజుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
ముదిరాజులను విస్మరిస్తే సహించం
ర్యాలీ సందర్భంగా ముదిరాజ్ నాయకులు మీడియాతో మాట్లాడారు. జనాభాలో అత్యధిక ఓటర్లు కలిగిన ముదిరాజ్ లను రాజకీయ పార్టీలు విస్మరిస్తే సహించేది లేదన్నారు. 119 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 115 మంది అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించిన కేసీఆర్ ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. ఇది ముమ్మాటికీ ముదిరాజులను అవమానించడమేన్నానరు. పదేళ్ళలో అనేక అంశాలపై సీఎం కేసీఆర్ తో కొట్లాడామన్నారు. బిసి డి నుంచి ఏ లకు మార్చడాన్ని అమలు చేయాలని కోరామన్నారు.
అయినా ఏ సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఇవాళ కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని ఇక్కడ ముదిరాజల కేసీఆర్ కు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారన్నారు. ఎల్లారెడ్డిలో 70 వేలు, కామారెడ్డిలో 50 వేలు, గజ్వేల్ లో 50 వేల ముదిరాజల ఓట్లు ఉన్నాయని, కేసీఆర్ ముదిరాజులకు న్యాయం చేయకపోతే కేసీఆర్ ను బొందపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పడానికే నేడు ధర్మయుద్దం ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మిగతా పార్టీలు కూడా ముదిరాజులపై మొసలి కన్నీరు కార్చడం కాదని, జనాభా ప్రాతిపదికన ముదిరాజులకు సీట్లు కేటాయించాల్సిందేనన్నారు. నేడు వేలాది మందితో ర్యాలీ చేపట్టామని, తమకు అన్యాయం చేస్తే భవిష్యత్తులో సీఎం కేసీఆర్ పై నామినేషన్లు వేసి ఒడిస్తామని హెచ్చరించారు.
జిల్లాలో మరిన్ని ర్యాలీలకు సన్నాహం
నేటి ధర్మయుద్దం ర్యాలీతో ముదిరాజులలో ఎక్కడ లేని జోష్ కనిపించింది. ర్యాలీలో పాల్గొనడానికి వేలాదిగా తరలిరావడంతో జిల్లాలో మరిన్ని ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. కామారెడ్డి జోష్ తో త్వరలో బాన్సువాడలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతామన్నారు. అలాగే సిరిసిల్లలో సైతం ర్యాలీ చేపడతామన్నారు. హైదరాబాద్ లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుడతామని దానికోసం ముదిరాజులను ఏకతాటిపైకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిజ్జన రమేష్, కరాటే రమేష్, భూపాల్ విజయానంద్, భట్టు విఠల్, చింతల నీలకంఠం, అబ్రబోయిన స్వామి, బొక్కల వేణు, వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
చట్టసభల్లో అవకాశం కల్పించాలి
ముదిరాజులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం అన్నారు. నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముదిరాజుల ఆధ్వర్యంలో ధర్మయుద్దం పేరుతో సుమారు 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా జనాభా ఉన్న ముదిరాజులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ముదిరాజులు పాల్గొన్నారని, పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ముదిరాజుల సమస్యను చట్టసభల్లో వినిపించేలా జనాభా ప్రాతిపదికన అవకాశం ఉన్నచోట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని కోరారు. తాను అధికార పార్టీలో కొనసాగుతున్నా తన సామాజిక వర్గం సమస్య పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్నానన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామన్నారు