తనకు టికెట్ ఇస్తానని చివరి వరకు నమ్మించి టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బీజేపీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిన తీరును ప్రజలకు వివరించారు. 2018 లో టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్ గా నామినేషన్ వేస్తే విత్ డ్రా చేయించారని, సురేందర్ గెలుపు కోసం నిరంతరం కృషి చేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే టిఆర్ఎస్ కు అమ్ముడుపోయారన్నారు.
దొంగ సర్వే రిపోర్టులు చూపించి ఈసారి మదన్ మోహన్ రావుకు టికెట్ ఇచ్చి పార్టీకోసం పని చేసిన తనకు తీరని అన్యాయం చేస్తే బీజేపీ అక్కున చేర్చుకుందన్నారు. మూడు నెలలు అమెరికాలో ఉండి 18 మంది పీఏలను మెయింటెన్ చేసే మదన్ మోహన్ రావు గెలిచాక బీఆర్ఎస్ గూటికి చేరుతారని తెలిపారు. మదన్ మోహన్ రావు కేసీఆర్ మనిషి అని అన్నారు. ఎల్లారెడ్డి ప్రజలకు అన్ని సమయాల్లో అండగా ఉన్నానని తెలిపారు. ఉచిత బస్సులు ఏర్పాటు చేశానని, ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. ప్రజలు చేతి గుర్తుకు ఓటువేసి మరోసారి మోసపోవద్దని కోరారు. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లారెడ్డిని అభివృద్ధి చేస్తానన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి