జీహెచ్ఎంసీలో ఓ వైపు మాటల తూటాలు పేలుతుండగా, మరో వైపు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీలు మేనిఫెస్టోలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. మొన్న టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయగా తాజాగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మేనిఫెస్టోను తలదన్నేలా ఒక అడుగు ముందుకేసి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం విశేషం.
కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మేనిఫెస్టోను గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
వరద బాధిత ప్రతి కుటుంబానికి రూ.50వేలు, పూర్తిగా దెబ్బతిన్న పూర్తిగా దెబ్బతిన్న గృహలకు రూ. 5లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ.2.5లక్షల చొప్పున సహాయం, కోవిడ్-19 ఆరోగ్యశ్రీలో చేరిక, ఉచిత రవాణా సదుపాయం, విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి, అర్హత గల వారికి గృహాలు, ఇంటి జాగా వున్న కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది లక్షల రూపాయిలు, సింగెల్ బెడ్ రూమ్ ఇల్లు అదనపు గది నిర్మాణానికి రూ. నాలుగు లక్షలు, ఆస్తిపన్ను రాయితీ, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ధరణి రద్దు, ఉచితంగా మంచినీటి సరఫరా 30వేల లీటర్లు ఉచితం, ఉచిత వాటర్ కనెక్షన్, మురికివాడల అభివృద్ధి అథారిటీ ఏర్పాటు, సఫాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.20 లక్షల బీమా, కేబుల్ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాఫీ, జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు రక్షణ అథారిటీ ఏర్పాటు చేసి కబ్జాదారుల చెర నుండి చెరువులని పరిరక్షణ, నాలా ఆక్రమణలను తొలగించడానికి కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫారసులని అమలు, హెచ్ఎండీఏ పరిధిలోని డ్రైనేజీని 500 కిలోమీటర్లకు పెంచడం, జీహెచ్ఎంసీ మేయర్, కార్పోటర్లందరినీ అన్ని విధాలుగా సాధికారుల్ని చేస్తామని, జీహెచ్ఎంసీలో అవినీతి పారద్రోలి, జవాబుదారీతనాన్ని పెంచడానికి లోక్పాల్ వ్యవస్థను అమలు చేస్తాం. జీహెచ్ఎంసీ మేయర్, కార్పోరేటర్లు, అధికారులును ఈ వ్యవస్థలోకి తెస్తామని వివరించారు.