మాతృభూమి అభివృద్ధిలో భాగస్వాములు కావడం ఒక గొప్ప వరమని, అభివృద్ధిని జీర్ణించుకోలేకపోవడం ఒక రోగం అని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి,తక్కెళ్లపల్లి రవీందర్ రావు సమక్షంలో శుక్రవారం హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరోవార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ములకలపల్లి రామగోపి, తన అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీపై పలువురు చేస్తున్న ఆరోపణలకు చేతలతో అభివృద్ధిని చేసి సమాధానం చెబుతామన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని కొందరు కౌన్సిలర్లు అర్థం లేని ఆరోపణలు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరడం మా అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ రామగోపి మాట్లాడుతూ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవికుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో, మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితుడినై టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.విమర్శలు చేసే నాయకుల పట్ల ప్రజలు విసుగుచెందుతున్నారని, వార్డు ప్రజల అభిప్రాయం మేరకే టీఆర్ఎస్ లో చేరానని అన్నారు.
ఈ కార్యక్రమంలో 22వ, వార్డు కౌన్సిలర్ అమరబొయిన సతీష్ ,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.