బీఆర్ఎస్ పార్టీ కొన్ని కారణాల వల్ల రాములు నాయక్కు టికెట్ కేటాయించకపోయినప్పటికీ ఆయన పార్టీకి కట్టుబడి పని చేస్తున్నారని, రాములునాయక్ ను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని కేటీర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో సుమారు రూ.250 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాములు నాయక్ మానవతావాదని ప్రశంసించారు. రాములు నాయక్ వైరా ప్రజల మనసు గెలుచుకున్నారని కొనియాడారు. కొన్ని కారణాల వల్ల వైరా టికెట్ను మదన్ లాల్కు కేటాయించామని వివరించారు. తనకు టికెట్టు, పదవులు ఏవీ శాశ్వతం కాదని, గిరిజనుల అభివృద్ధి ముఖ్యమని రాములు నాయక్ చెపుతారని, ఆయనకు పార్టీ అండగా ఉంటుందన్నారు.