రాష్ట్ర హైకోర్టు తనను తిరిగి నియమించినందున తాను పదవీబాధ్యతలు స్వీకరించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ తెలిపారు. తన విధిని తాను నిష్పక్షపాతంగా గతంలో మాదిరిగానే నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఇది తన బాధ్యత అని ఆయన అన్నారు.
సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి తదుపరి ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. వ్యక్తులు శాశ్వతం కాదని అయితే రాజ్యాంగ వ్యవస్థలు వాటి విలువలు మాత్రం శాశ్వతమని ఆయన అన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వారికి రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. రాజ్యాంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉన్నత పదవులలో ఉన్న వారికి కచ్చితంగా ఉండాలని ఆయన అన్నారు.