పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు. బంగారు తెలంగాణ అంటారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసా? జీతాల్లేక కాంట్రాక్టు ఉద్యోగులు అల్లాడుతున్నారు. కడుపుకాలి రోడ్డుపైకి వస్తున్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రి లో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బందికి 8 నెలలుగా జీతాలు రాలేదు. పని మాత్రం చేయించుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి మరీ పని చేశారు. అయితే వారికి జీతాలు మాత్రం రావడం లేదు. వారిని కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్ పై ఎవరో కోర్టుకు వెళ్లారట.
కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సిబ్బందికి ఆ కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వడం లేదట. ఇదీ కథ. ఎంత హాస్యాస్పదంగా ఉంది. కాంట్రాక్టర్ జీతం ఇవ్వకపోతే ఆ కాంట్రాక్టర్ పై ప్రభుత్వం చర్య తీసుకోలేదా?
కోర్టు తీర్పునకు అనుగుణంగా తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు కదా? కానీ ఈ పని ఎవరు చెయ్యాలి? దీనికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మంత్రి సమాధానం చెప్పాలి.
జీతాలు ఇవ్వకుండా తమ తో పని చేయించుకుంటున్నారని ఆక్రోశం వెలిబుచ్చుతూ కాంట్రాక్టు ఉద్యోగులు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.
ఐదు రోజుల్లో జీతాలు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఆ ఉద్యోగులు చెబుతున్నారు.