చైనా లో కరోనా వ్యాధి విస్పోటనం సంభవించింది. 24 గంటల్లో మూడు కోట్ల 70 లక్షల మందికి పైగా వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఆసుపత్రుల్లో పడకలు, మందులు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. రోడ్డు పక్కన డ్రిప్లు వేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అయితే, చైనా తన అధికారిక నివేదికలో కేవలం 4,103 మందికి మాత్రమే సోకినట్లు నిర్ధారించింది.
ఇళ్లు, ఆసుపత్రులు, శ్మశాన వాటికల్లో విపరీతమైన రద్దీ ఉంది. చైనాలోని వివిధ రాష్ట్రాల్లో ప్రచురించిన డేటాను ఉటంకిస్తూ, బ్లూమ్బెర్గ్ శుక్రవారం 24 గంటల్లో, 37 మిలియన్లకు పైగా ప్రజలు వ్యాధి బారిన పడ్డారని పేర్కొంది. ఒక్కో నగరంలో మూడు నుంచి పది లక్షల మంది రోగులు వస్తున్నారు. బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, మందుల కొరత తీవ్రంగా ఉంది. రోగులకు ఆస్పత్రి బయట రోడ్డు పక్కన డ్రిప్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఆసుపత్రుల వార్డులు నిండిన తర్వాత, టెర్రస్, కారిడార్ వరకు రోగులను చేర్చారు. అనేక క్రీడా స్టేడియాలు తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చబడ్డాయి. జ్వరం, కరోనా సోకిన తర్వాత కూడా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నారు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం చైనాలో పెద్ద సంఖ్యలో వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది కూడా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. తీవ్ర జ్వరం, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఆసుపత్రుల్లో ప్రజలకు చికిత్స అందిస్తున్నారు. చైనాలో కరోనాతో మరణించిన వారిని ఖననం చేయడం లేదా కాల్చడం జరుగుతోంది.
దీంతో శ్మశానవాటికలు, అంత్యక్రియల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. రెండు రోజుల నిరీక్షణ తర్వాత మాత్రమే ప్రజలు తమ ఆత్మీయుల అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లభిస్తోంది. ఈ వెయిటింగ్ లిస్ట్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఆసుపత్రి మార్చురీలో కూడా ఖాళీ లేదు. దీంతో ప్రస్తుతం మృతదేహాలను ఆస్పత్రి కారిడార్లోనే ఉంచుతున్నారు. కరోనా కారణంగా ప్రజలు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
చైనా అంతటా ఆక్సిజన్ సంక్షోభం నెలకొంది. ఆసుపత్రి బయట ఊపిరాడక చనిపోతున్న వీడియోలు ఎన్నో తెరపైకి వచ్చాయి. ఆస్పత్రులు, మెడికల్ స్టోర్లలో మందుల కొరత ఉంది. దీంతో ఫార్మాస్యూటికల్ కంపెనీల ముందు ప్రజలు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. ప్రజలు నేరుగా కంపెనీల నుంచి మందులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.