దుబ్బాక ఎమ్మెల్యే (శాసనసభ) స్థానం బీజేపీ హస్తగతం వెనుక మర్మం ఏంటీ? తెలంగాణ రాష్ర్టం వచ్చిన తరువాత ఇంత వ్యతిరేకత గులాబీ పార్టీకి రావడం ఏంటీ? దీని వెనుక ఉన్న ప్రధాన కారణం? తదితరాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ప్రధాన నేతలతో ప్రగతి భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ కేవలం టీఆర్ఎస్ నేతలతో ఉంటే చర్చకు గెలుపోటములకు ఇంతటి ప్రాధాన్యత లభించేది కాదు గానీ.. ఈ భేటీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పార్టీ నేతలు కూడా పాల్గొనడం వెనుక ఉన్న మర్మం ఏంటోననే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల టీఆర్ఎస్ దుబ్బాకలో ఓడడం వెనుక ఇతోధికంగా మైనార్టీ ఓట్లు కూడా దోహదం చేసినట్లు ప్రచారం జరగడంతో, ఈ భేటీలో ఎంపీ పాల్గొనడం.. రాబోయే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై కేసీఆర్ చాణక్యనీతిని ప్రదర్శిస్తారనే ఊహాగానాలున్నాయి.
అందుకే తమ పార్టీ నేతలతోపాటు ఎంపీ అసదుద్దీన్తో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం 150 స్థానాలుండగా గతంలో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 40 స్థానాలు గెలుచుకున్న విషయం విదితమే. మిగతా 11 స్థానాలను మాత్రం ఇతరులు లబ్ధి పొందారు. కాగా అదేస్థాయిలో ఈసారి కూడా గెలుపోటముల కోసం విశ్వప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుందని తెలుస్తోంది.
అయితే దుబ్బాక విజయంతో ఊరిమే ఉత్సాహంతో ఉన్న బీజేపీ కాస్త నిలకడగా పోటీ చేసే పరిస్థితులు మాత్రం కనబడడం లేదు. ఈ సారి మాత్రం పోటీ రసవత్తరంగా ఉండాలని.. తద్వారా టీఆర్ఎస్ను పతనం దిశగా తీసుకువెళ్లాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డిలు దుబ్బాక దీపావళి కానుకని… సంక్రాంతి కానుకగా కార్పొరేషన్ ను అందిస్తామని పత్రికాముఖంగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ అప్రమత్తమై ఈ భేటీ నిర్వహించారు. అంతేగాకుండా నిరుపేదలపై పలు తాయిలాల అస్ర్తం కూడా ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి జరిగే కార్పొరేషన్ ఎన్నికలు మాత్రం ఎన్నడూ లేనంతగా రసవత్తరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకుల వాదన.