రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రితో పాటు నలుగురు ఐఏఎస్ అధికారులపై కేసులు నమోదు చెయ్యాలన్న ఆదేశాలను అమలు చేయక పోవటంపై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు నమోదు చేసి వివరాలను కోర్టుకు అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిని అమలు చెయ్యకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
2018లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. కాగా, శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్ను టాంపర్ చేసారంటూ మహబూబ్ నగర్కు చెందిన రాఘవేందర్ రాజు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుతో పాటు హైకోర్టులో కూడా పిటిషన్లు వేసారు.
దీనిపై విచారణ జరిపిన ప్రజా ప్రతినిధుల కోర్టు ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు నలుగురు అధికారులపై కేసులు నమోదు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇప్పటివరకు పోలీసులు కేసులు నమోదు చెయ్యలేదు. దీనిపైనే తాజాగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.