వేసవిలో తాగు నీటి సరఫరాపై పల్నాడు జిల్లా తొలి సమీక్ష సమావేశం జరిగింది. పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాత.. జిల్లా కేంద్రంలోని నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన తొలి జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
జిల్లా ఇన్ఛార్జి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ లోతేటి శివశంకర్, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైద్య-విద్యా, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మ నాయుడు, నంబూరి శంకర్ రావు, కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, లక్ష్మణ రావు, జంగా కృష్ణమూర్తి, ఎస్పీ రవి శంకర్ రెడ్డి, జేసి శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విపర్ల రెడ్డి పాలెం గ్రామంలో మంచినీటి చెరువు ఏర్పాటుకు సంబంధించి గుంటూరు బ్రాంచ్ కెనాల్ నుంచి హాల్ఫ్ టెక్ కావాలని కోరారు.
చెరువులో నీరు నింపేందుకు కావాల్సిన పరిపాలన అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. అన్నవరం గ్రామంలో శేషమ్మ చెరువు ఏర్పాటుకు అంచనాలు తయారు చేశారని, వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరారు. సీపీడబ్ల్యూ పరంగా రిపేర్లు ఉన్నాయని వాటిని బాగు చేయాలని కోరారు. చిన్నతురకపాలెం, మునుమాక, విపర్లపల్లి గ్రామాల్లో సమగ్ర రక్షణ నీటి పథకం కింద నీరు చేరేలా చూడాలని కోరారు.
గోనేపూడి గ్రామంలో రూ.80 లక్షలు నాబార్డు గ్రాంట్ కింద మంజురవ్వగా పైప్ లైన్లు కూడా వేశారని.. మోటర్ల ద్వారా నీటి తరలింపునకు సంబంధించి చెరువు వద్ద కరెంట్ సప్లై కోసం రూ.9.8 లక్షలు వెచ్చించినా ఇంకా విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని కోరారు. ఇటీవలే నరసరావుపేట మున్సిపాలిటిలో మేజర్ వాటర్ పైప్ లైన్ లీకేజీతో ప్రజలు వారం రోజులు పాటు నీరు లేక ఇబ్బంది పడ్డారని… 20 ఏళ్ల క్రితం వేసిన పైపు లైన్లు పాడైపోయి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపాలిటిలో కొత్త పైప్ లైన్ల ఏర్పాటుకు సహకారం అందించాలని విజప్తి చేశారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. దీంతో పాటు స్టాఫ్ అప్ గ్రేడిషన్ కూడా జరిగితే గుంటూరు జీజీహెచ్ మీద ఒత్తిడి తగ్గించడంతో పాటు పల్నాడు ప్రజలకు వైద్య సేవలను మరింత దగ్గర చేసినట్లు అవుతుందని అన్నారు.
గతేడాది మిర్చిపంటకు తామర తెగులు సోకి రైతులు చాలా నష్టపోయారని, బయోఫెర్టిలైజర్స్ వాడకం ద్వారా కొన్ని గ్రామాల్లో తెగులు బెడత కొంత తగ్గిందని తెలిపారు. ఈ ఏడాది పంట వెస్తే తెగులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్య పరచాలని కోరారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా