కేరళలో సంచలనం సృష్టిస్తున్న యాక్టర్ దిలీప్ చేసిన అత్యాచారం కేసులో విచారణ నిలుపుదల చేయాల్సిందిగా కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎర్నాకుళం సిబిఐ అడిషనల్ సెషన్స్ ప్రత్యేక జడ్జి కోర్టులో కేసు విచారణ సక్రమంగా జరగడంలేదని అత్యాచారానికి గురి అయిన యువతి ఆరోపించింది.
యాక్టర్ దిలీప్ తో బాటు ఆయన న్యాయవాదులు అత్యంత హేయమైన, అత్యంత దారుణమైన పదాలు వాడుతున్నా ప్రత్యేక కోర్టు జడ్జి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది.
తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రశ్నలు వేస్తున్నా, తనకు ఎంతో ఇబ్బంది కలిగించే తన వ్యక్తిగత ప్రశ్నలు వేస్తున్నా జడ్జి ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడం వల్ల తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆమె తరపు సీనియర్ న్యాయవాది కోర్టు కు వెల్లడించారు.
న్యాయవాదుల ప్రవర్తనపై బాధితురాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా న్యాయమూర్తి పట్టించుకోలేదని, ఆమె కూడా అలాంటి ప్రశ్నలే అడగడం యువతికి మరింత ఇబ్బంది కలిగించిందని బాధితురాలి తరపు న్యాయవాది అన్నారు.
అంతే కాకుండా కేసు వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు జడ్జికి కూడా విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు జడ్జి బహిరంగంగానే చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితురాలికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని ఆయన తెలిపారు.
న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నట్లు నమ్మకం కూడా కలిగించాల్సిన అవసరం ఉందని బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు. న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన కేసు విచారణను ఈ నెల 6 వరకూ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోపు తాము కేసును పూర్తిగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది.