తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నరసింహన్ స్థానంలో ఎవరిని నియమించాలన్నది కూడా సూత్రప్రాయంగా ఖరారు చేసినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడుకే చెందిన మరొకరిని తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉన్నాయి. గత కొంతకాలంగా గవర్నర్ బదిలీ విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
వీటన్నింటికీ చెక్ పెడుతూ ఎట్టకేలకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్ గా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పనిచేసిన రికార్డు నరసింహన్ కు దక్కుతుంది. దీంతోపాటు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్ గా కూడా ఆయన గుర్తింపు పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో, ఆనాడు ఉద్యమనేతగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 డిసెంబర్లో దీక్ష చేయడం, అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించడం, దీనికి వ్యతిరేకంగా సమైక్య ఆంధ్ర ఉద్యమం నడుస్తున్న సమయంలో, 2009 డిసెంబర్ 29 న, ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చి పంపించారు. జనవరి 23, 2010 న ఆంధ్రప్రదేశ్ కు నరసింహన్ ను పూర్తిస్థాయి గవర్నర్ గా నియమించారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచి తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహనతో నరసింహన్ వ్యవహరించారు. 2014 లో రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత కీలక పాత్ర నిర్వర్తించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ మొదలు అనేక ఇతర సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను, వివాదాలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరడంతోపాటు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉమ్మడి సమావేశాలను గవర్నర్ ఏర్పాటు చేశారు.