ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వారి సహాయార్థం తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్ రూ. 550 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. నిజమైన లబ్ధిదారులకు ముంపు సహాయం అందించడమే పెద్ద ప్రహసనంలా మారింది.
సహాయంలో స్థానిక నేతల మాయాజాలం.. అనుచరులు, బంధుగణానికే ఆర్థిక సహాయం..
ఇక్కడే స్థానిక గులాబీ నేతలు తమ హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆర్థిక సహాయం అందించాల్సిన బాధితులకు కాకుండా ముందుగా ఆయా కార్పొరేటర్ల ముఖ్య అనుచరులు, బంధుగణం, కౌన్సిలర్ల ముఖ్య అనుచరులు, బంధుగణానికి ఒక్క ఇంట్లో నలుగురికి చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తూ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఇక నిజమైన ముంపు బాధితులు అక్కడక్కడా ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నా వారిని కనికరించేనాథుడే కనబడకపోవడం విశేషం.
బాధితులకు అందరికీ అందిస్తామంటున్న మంత్రి కేటీఆర్
ఓ వైపు మంత్రి కేటీఆర్ ముంపు సహాయం అందరికీ అందుతుందని స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ బాధితుల్లో నమ్మకం కల్పించలేకపోయారనే వాదన ఉంది. బాధితులు ఆయా చోట్ల స్థానిక టీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నా.. వారు మాత్రం తొలుతగా వారి అనుంగులకు సహాయం అందించి చేతులు దులుపుకొని బాధితులకు మాత్రం రేపు మాపు, అధికారులు రావడం లేదు.. అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారని ముంపు బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా నిజమైన ముంపు బాధితులకు పరిహారం అందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్కు గడ్డుకాలమేనా?
లేకుంటే ఎమ్మెల్సీ, కార్పొరేటర్ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని ఆయాచోట్ల ముంపు బాధితులు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులను కూడా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది? స్థానిక నేతలపై చర్యలకు పూనుకుంటుందా.. లేదా ముంపు బాధితులకు అందరికీ ఆర్థిక సహాయం అందజేస్తుందా? లేదా ముంపు సహాయంలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ చేస్తుందా అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. అయితే పరిస్థితులు ఇలానే ఉంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్కు భంగపాటు తప్పదనే వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి.