ఇప్పటికే జాతీయ స్థాయి గుర్తింపును కోల్పోయిన సిపిఐ , రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళిక అమలు చేస్తున్నది. ఇప్పటికే మండలాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ జూన్ 4 వ తేదీన కొత్తగూడెం లో భారీ భహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ సభకు లక్ష మందికిపైగా జనాన్ని తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సొంత నియోజకవర్గమైన కొత్తగూడెం కేంద్రంగానే ఈ సభను నిర్వహించాలనుకోవటం చర్చకు దారితీసింది. అలాగే కొత్తగూడెం లో సిపిఐ పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన నేపధ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది.
కాగా సిపిఐ బలాన్ని ప్రతిభింభింపజేసే రీతిలో బహిరంగ సభను నిర్వహిస్తామని నేతలు చెబుతుండగా, ఈ విజయవంతానికి గ్రామ స్థాయి నుంచి సభలు, సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తలను భారీగా తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, జాతీయ నాయకులు కె.
నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, గోరేటి వెంకన్న, అంబేడ్కర్ మనమడు ప్రకాష్ అంబేడ్కర్ పాల్గొననున్నారు. ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన చేపట్టిన ప్రజాపోరు యాత్రకు విశేష స్పందన లభించింది. లక్షలాది మందికి పార్టీ సందేశాన్ని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించడం జరిగిందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. రానున్న కాలంలో మరింత విస్తృతంగా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాన్ని, ప్రస్తుత రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిసింది.
వచ్చే ఎన్నికలలో సిపిఎం, సిపిఐ కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ప్రకటించిన నేపధ్యంలో, ఎన్నికల ముందు జరుగుతున్న తొలి సభ కావటంతో దీనిని విజయవంతం చేసేందుకు గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను ప్రచారంలోకి దింపారు. అలాగే రాష్ట్రంలోని సిపిఐ నాయకులందరిని ఈ సభకు రావాలని అధినాయకత్వం సూచించింది.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ గ్రామ గ్రామాన సిపిఐ చేపట్టిన ప్రజాపోరు యాత్రకు విశేష స్పందన లభించిందన్నారు. లక్షలాది మందికి పార్టీ సందేశాన్ని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరింత విస్తృతంగా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాన్ని, ప్రస్తుత రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
కమ్యూనిస్టు పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర సమితి నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. కొత్తగూడెం సభ ద్వారా తమ బలాన్ని తెలియచేస్తామన్నారు.