రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపైన, మైనరు డ్రైవింగు చేస్తున్న వారిపైన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ (కార్యాచరణ) చేపట్టారు.
ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లు పరిధిలో సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది ముఖ్య కూడళ్ళు, బహిరంగ ప్రదేశాలు, జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీల్లో వాహనదారుల లైసెన్సులు, వాహనాల రికార్డులను పరిశీలించడంతో పాటు, బ్రీత్ ఎనలైజర్లుతో వాహనదారులను తనిఖీ చేసి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసారు.
నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై మోటారు వాహన చట్టం ప్రకారం ఈ-చలానాలను విధించారు. 22వ తేదీన చేపట్టిన ఆకస్మిక ప్రత్యేక కార్యాచరణలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 98 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 55 కేసులు, ఇతర నిబంధనలను అతిక్రమించిన వారిపై 635 కేసులు నమోదు చేసారు.
2022 లో ఇప్పటి వరకు 1,360 డ్రంకన్ డ్రైవ్ కేసులు, 2,609 ఓపెన్ డ్రింకింగు కేసులు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 38,632 కేసులు, త్రిబుల్ రైడింగు చేసిన వారిపై 6,085 కేసులు, లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన వారిపై 4,676 కేసులు, మైనరు డ్రైవింగు చేసిన వారిపై 511 కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు.
రహదారి ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామన్నారు. లైసెన్సులు లేకుండా మైనర్లు వాహనాలు నడిపినా, మైనర్లు డ్రైవింగు చేసేందుకు వాహన యజమానులు అనుమతించినా కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రమాదాలకు కారణమవుతున్న మైనర్లు, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని శాఖా సిబ్బంది ని జిల్లా ఎస్పీ దీపిక ఆదేశించారు.