మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.18 కోట్లు ఇస్తే ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామన్న టీఆర్ఎస్ ప్రకటనపై మిత్రపక్షమైన సీపీఎం అసహనం వ్యక్తం చేసింది. బీజేపీ పట్ల రాజకీయంగా మెతక వైఖరి సరైంది కాదని స్పష్టం చేసింది. మంత్రులు జగదీశ్రెడ్డి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ పట్ల మెతక వైఖరిని సూచిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. టీఆర్ఎస్ డబ్బుల కోసమే అక్కడ పోటీ చేస్తోందా, నిజంగా డబ్బులు ఇస్తే ఎన్నికల నుంచి విత్డ్రా చేసుకుంటారా అని తమ్మినేని ప్రశ్నించారు. బీజేపీ, మతోన్మాద వ్యతిరేకత అనేది నియోజకవర్గ డబ్బుల కోసమా? అని ప్రశ్నించారు. మోదీ దేశం మొత్తాన్ని అభివృద్ధి చేస్తానన్న ప్రకటనతో బీజేపీతో తమకు పంచాయతీ లేదని చెప్తారా? భవిష్యత్తులో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఒకవేళ సత్సంబంధాలు వస్తే బీజేపీని సమర్ధిస్తారు కదా? ఇది సరైన వైఖరి కాదని ఆయన టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. కాగా తమ్మినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపాయి. టీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు కూడా సందిగ్ధంలో పడినట్లు సమాచారం. ఇక నుంచి అటువంటి వ్యాఖ్యలు చేయబోమని వారన్నట్లు తెలిసింది.
previous post
next post