ఇటీవల కాలంలో డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా లావాదేవీల జరుపుతున్న వారి సంఖ్య పెరుగుతుందని, అదేవిధంగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ద్వారా అనేక నేరాలు పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రుణయాప్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు.
అక్రమ రుణ యాప్ సంస్థలు సూక్ష్మ క్రెడిట్లను అందజేస్తోన్నారని ముఖ్యంగా బలహీన వర్గాల కు అధిక వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ చార్జీలతో లోన్లు ఇచ్చి బ్లాక్ మెయిలింగ్, నేరపూరిత బెదిరింపులతో కూడిన దోపిడీ రికవరీ పద్ధతులకు పాల్పడుతున్నారని తెలిపారు. అక్రమ యాప్ ద్వారా వేలల్లో అప్పు తీసుకుంటే లక్షల్లో దోచేస్తూ అప్పు ఎంత తీర్చినా సరిపెట్టుకోకుండా మరిన్ని రుణ యాప్ డౌన్లోడ్ చేయించి వారికి చిన్న చిన్న అప్పులు ఇస్తూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రుణ యాప్ మీద డౌన్లోడ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే మొబైల్ ఫోన్ యొక్క కాంటెక్ట్స్, ఎస్ఎంఎస్ స్టోరేజీ మరియు ఇతర అనుమతులను అడిగి వ్యక్తిగత సమాచారాన్ని మీకు తెలియకుండా తస్కరిస్తారని తెలిపారు. అంతే కాకుండా ఫ్యామిలీ ఫోటోస్, కాల్ రికార్డింగ్స్ మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలుగా మార్చి మీ బంధువులకు, స్నేహితులకు సామాజిక మాధ్యమాలలో పంపి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారన్నారు.
రుణ గ్రహీతలనే కాకుండా వారి కుటుంబ సభ్యులను మరియు సన్నిహితులను డిఫాల్టర్లుగా ప్రకటించి బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తోన్నారని తెలిపారు. అంతేకాకుండా వారిపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. రుణ యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు అనుమతులను ఇవ్వవద్దని డీజీపీ కోరారు. నకిలీ రుణ యాప్స్ సంస్థలు ఎటువంటి హామీ పత్రాలను, సిబిల్ స్టోర్ లేకుండా వెంటనే రుణాలు మంజూరు చేస్తామని ఎరవేస్తారని, మొత్తం రుణం తీర్చిన తర్వాత కూడా ఇంకా చెల్లించాలని వేధిస్తారని వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 75 అక్రమ రుణ యాప్ వేధింపులు కేసులు నమోదు కాగా అందులో 80 మందిని గుర్తించి వారిని అరెస్టు చేయడం జరిగిందని, మిగిలిన కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి నేరాలు పాల్పడిన వారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. లోన్ యాప్ కేసులలో రుణ యాప్ డెవలపర్లు కూడా నేరస్తులు గాని పరిగణించబడతారన్నారు. తెలియని వెబ్ సైట్లు, లింకుల ద్వారా ఎటువంటి రుణ యాప్ లను డౌన్ లోడ్ చేయవద్దని సూచించారు. బెదిరింపు కాల్స్ , ఎస్ఎంఎస్ లు, ఫోటో మార్ఫింగ్ లకు భయపడి అధిక మొత్తం చెల్లించడం, ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.