ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా సాయంత్రం నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆద్యంతం భక్తిభావాన్ని పంచాయి. సాయంత్రం 4 గంటల నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు వైఎల్ శ్రీనివాసులు బృందం నాదస్వరం-డోలు వాద్యం మంగళప్రదంగా ప్రారంభమైంది. ఆ తరువాత ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కలిసి 40 మంది శ్రీరామ నామామృతం భజన సంకీర్తనలు వీనులవిందుగా గానం చేశారు.
భజన సంప్రదాయంలో ఆలపించిన కీర్తనలకు పలువురు భక్తులు గొంతు కలిపి నృత్యం చేశారు. గణేశ శరణం శరణం గణేశా…, రామ రామ రామ రామ రామ నామ తారకం…., రామ రామ జయ రాజరాం…., తదితర భజన కీర్తనలు భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తాయి. అనంతరం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో శ్రీరామకృతులు నృత్యం మైమరపింపచేసింది. ఇందులో శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేకంలోని అంశాలను నృత్య రూపంలో చక్కగా ప్రదర్శించారు. ఎపి హై కోర్టు జడ్జి బి కృష్ణమోహన్ , వై ఎస్ ఆర్ జిల్లా జిల్లా సి ఎన్ మూర్తి తో పాటు పలువురు ప్రముఖులు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దుబాల, కళాకారులు బుల్లెమ్మ, డాక్టర్ వందన, శ్రీమతి చిన్నమదేవి, అనంతకృష్ణ, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.