నేడు భారతీయ జనతా పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా వచ్చే వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజల్లోకి వెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఒకప్పుడు భాజపా తన ఉనికి కోసం పోరాడింది. ఇప్పుడు దేశంలో రెండో సారి అధికారంలోకి రావడమే కాకుండా అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కేంద్రంలో వరుసగా రెండోసారి అత్యధిక మెజారిటీ సాధించి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ గా అవతరించింది. 1980 లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అత్యధికంగా 353 సీట్లు గెలుచుకుంది.
జనతా పార్టీ అభ్యర్థులు 31 మంది మాత్రమే గెలుపొందారు. ఇదే జనతా పార్టీ అప్పటికి మూడేళ్ల క్రితం అంటే 1977 జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత జనతా పార్టీ నేతలు విడిపోయారు. నేతల ద్వంద్వ పాత్రలే ఓటమికి కారణమని జాతీయ కార్యవర్గం పేర్కొంది. ఎమర్జెన్సీ కాలంలో అనేక ప్రతిపక్ష పార్టీల కలయికతో ఏర్పడిన ఈ పార్టీ విరుద్ధ భావజాలంలో చిక్కుకుంది. జనసంఘ్ నేతల ద్వంద్వ పాత్రపై నిషేధం విధించాలని సమాజ్వాదీ వర్గానికి చెందిన కొందరు నేతలు డిమాండ్ చేశారు.
జనసంఘ్ నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లోనే ఉండాలని లేదా జనతా పార్టీ కోసం పనిచేయాలని వత్తిడి మొదలైంది. రెండింటిలో ఒకటి ఎంచుకోవాలి అనే వత్తిడి ఎక్కువ కావడంతో భారతీయ జనసంఘ్ నాయకులు జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ఏప్రిల్ 6, 1980న ఈ నాయకులు భారతీయ జనతా పార్టీ అనే కొత్త రాజకీయ సంస్థను స్థాపించారు.
కొత్త పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నికయ్యారు.1984 అక్టోబర్ 31న దేశ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ తొలిసారిగా 1984 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంది. ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోయింది. సానుభూతి పరంపరలో 404 మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ ఖాతాలో కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఈ పరిస్థితిని ఎగతాళి చేశారు. ‘హమ్ దో, హమారే దో’ అని ఆయన వ్యాఖ్యానించేవారు. పార్టీ అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు బీజేపీ ఎంపీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. కాంగ్రెస్ హవాలోనూ భాజపాకు విజయాన్ని అందించిన వారు డాక్టర్ ఎకె పటేల్, జంగారెడ్డి.
గుజరాత్లోని మెహసానా స్థానం నుంచి పటేల్ గెలుపొందగా, ఆంధ్ర ప్రదేశ్లోని హన్మకొండ స్థానం నుంచి జంగారెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 1984 ఎన్నికల్లో బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఓడిపోయారు. 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తుపానులో మాధవ్ రావ్ సింధియా చేతిలో ఆయన ఓడిపోయారు. 1984లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఇప్పుడు 303 ఎంపీలు ఉండగా, కాంగ్రెస్ 414 సీట్ల నుంచి 52కి పడిపోయింది.
1984 లో బీజేపీ స్థానాలు 02
1989 లో బీజేపీ స్థానాలు 85
1991 లో బీజేపీ స్థానాలు 120
1996 లో బీజేపీ స్థానాలు 161
1998 లో బీజేపీ స్థానాలు 182
1999 లో బీజేపీ స్థానాలు 182
2004 లో బీజేపీ స్థానాలు 138
2009 లో బీజేపీ స్థానాలు 116
2014 లో బీజేపీ స్థానాలు 282
2019 లో బీజేపీ స్థానాలు 303