ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కల్యాణం సందర్భంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున బుధవారం ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రమంత్రికి టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు ,ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు మంత్రికి తలపాగా కట్టి పళ్లెం లో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు.
మంత్రి దంపతులు వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రికి వేద పండితులు శేషవస్త్రం అందించి వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి సత్యనారాయణ ,జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, టీటీడీ జెఈవోలు సదా భార్గవి, వీర బ్రహ్మం ఉన్నారు. అంతకు ముందు టీటీడీ అథితి గృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈవో లు సదా భార్గవి, వీర బ్రహ్మం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.