స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పొతంగల్ విశాల సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని పొతంగల్ సహకార సంఘ నూతన చైర్మన్ గా ఎన్నికైన శాంతీశ్వర్ పటేల్ పేర్కొన్నారు. కోటగిరి మండల పరిధిలోని పొతంగల్ సహకార సంఘ చైర్మెన్, వైస్ చైర్మన్ల ఎన్నికలను ఆదివారం ఎన్నికల అధికారి విష్ణు వర్ధన్ నిర్వహించగా చైర్మన్ పదవికి శాంతీశ్వర్ పటేల్, వైస్ చైర్మన్ పదవికి గంధపు పవన్లనుండి కేవలం ఒకే నామినేషన్ రావటంతో చైర్మన్,వైస్ చైర్మెన్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ధృవీకరించి ప్రకటించారు.
అనంతరం సొసైటీ డైరెక్టర్లతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శాంతీశ్వర్ పటేల్ పొతంగల్ సొసైటీ చైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నికున్న సొసైటీ పరిధి రైతులకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. ఇందుకు సహకరించిన అన్ని పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పొతంగల్ సహకార సంఘాన్ని అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఉన్న పొతంగల్ సహకార సంఘానికి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. అధ్యక్షునిగా బాధ్యతను అప్పగించినందున ముందు ముందు పార్టీల తారతమ్యం లేకుండా సంఘ అభివృద్దికి కృషిచేస్తానని, డైరెక్టర్ల ఆలోచనలతో సంఘాన్ని నెంబర్ వన్ చేస్తానని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఆయా పార్టీల నాయకులు నూతన చైర్మన్,వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ఎంపీపీ గంగాధర్ పటేల్, ఏఎంసీ చైర్మెన్ గంగాధర్, రైసస అధ్యక్షుడు కిషోర్ బాబు,సర్పంచ్ వర్ని శంకర్ ,మాజీ జడ్పీటీసీ పుప్పాల శంకర్,ఎంపీటీసీ కేశ వీరేశం,ఏఎంసీ వైస్ చైర్మన్ జుమ్మాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి మండల పరిధిలోని నాలుగు సహకార సంఘాల చైర్మన్,వైస్ చైర్మన్ల ఆదివారం జరగాల్సి ఉండగా ఒక్క పొతంగల్ సహకార సంఘం లో మాత్రం చైర్మెన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగింది. మిగిలిన కోటగిరి, కొత్తపల్లి, ఎత్తొండ సహకార సంఘాలలో చైర్మన్,వైస్ చైర్మన్ ల ఎన్నికకు అధికారులు హాజరైనప్పటికీ డైరెక్టర్ల కోరం హాజరు కాకపోవటంతో ఎన్నికల అధికారులు ఎన్నికను సోమవారానికి వాయిదా వేశారు.