ఎన్నికలు వస్తున్నాయంటే మాత్రమే అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులకు రాయలసీమ కరువు గుర్తుకొస్తుంది తప్ప ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు.
రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని, పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, సిపిఎస్ ను రద్దు చేస్తామని, అమరావతే రాజధానని ఇలా అనేక హామీలను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా బిజెపి ఇటీవల ప్రకటించిన రాయలసీమ
డిక్లరేషన్ లో రాష్ట్రానికి “రెండవ రాజధానిగా” రాయలసీమను ప్రకటిస్తామని చెప్పారని ఆయన అన్నారు “రాయలసీమ అభివృద్ధి మండలి” తీసుకొస్తామని పదివేల కోట్లు కేటాయిస్తామని నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలుగా మారుస్తామని కూడా ప్రకటించారు ఆ మాటకు కట్టుబడి ఉన్నారా లేదా సీమ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలి అని ఆయన
డిమాండ్ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలూ రాయలసీమకు ఇచ్చిన హామీలు మర్చిపోయాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు ప్రత్యేక హోదా ఊసే లేదు కర్నూలు హైకోర్టు బెంచ్ “ఆకులో అరటిపండులా” తయారైందని నవీన్
కుమార్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున నారా లోకేష్ రాయలసీమ డిక్లరేషన్ త్వరలో ప్రకటించబోతున్నారు అందులో ప్రధానంగా రాయలసీమ రైతాంగానికి ఉరితాడులా మారి కర్ణాటకలో “అక్రమంగా నిర్మిస్తున్న అప్పర్ భద్ర” ప్రాజెక్టుని ఏ విధంగా అడ్డుకోబోతున్నారో ప్రకటించాలి. “రాయలసీమ అభివృద్ధి బోర్డు” ఏర్పాటు చేసి పెండింగ్ ప్రాజెక్టుల
నిర్మాణం కోసం 20 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. “శ్రీబాగ్” ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని,హైకోర్టు పై స్పష్టమైన ప్రకటన చేయాలి. రాయలసీమ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఎటువంటి “టైం బౌండ్ పైలెట్ ప్రాజెక్టులను” నిర్మించబోతున్నారో బహిరంగ ప్రకటన చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ
ప్రాంత ప్రజలను అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం “ఏరు దాటకముందు ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న” అని గాలికి వదిలేయడం పరిపాటిగా మారింది. రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది కరువుకి కేరాఫ్ అడ్రస్ గా మారింది ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు
రాయలసీమ డిక్లరేషన్లు ప్రకటించడం సీమ ప్రాంత ప్రజలకు “దింపుడు కళ్లెం ఆశల” తయారైంది. రాయలసీమ ప్రాంత ప్రజల జీవితాలతో దాగుడుమూతలు ఆడకుండా ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కోసం కాకుండా చిత్తశుద్ధితో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి తూచా తప్పకుండా అమలు చేయాలని నారా లోకేష్ ని రాయలసీమ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేశారు.