అధికార పార్టీ నుంచి ఎవరు అండదండలు ఇస్తున్నారో తెలియదు కానీ కొల్లాపూర్ కోట ప్రాంతంలో నిర్మాణాలు యథాప్రకారం జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేస్తున్నారు. కొల్లాపూర్ కోట ప్రాంతాన్ని ప్రజల కోసం వినియోగించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేస్తున్న పోరాటానికి ఎవరో పై స్థాయి నుంచి అడ్డుతగులుతున్నట్లుగా కనిపిస్తున్నది. కోటలో స్థలాలు కొనడం చెల్లదని ప్రభుత్వం చెప్పినా కూడా వినకుండా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటే స్థానిక నాయకులు ఎంతకు తెగించారో అర్ధం చేసుకోవచ్చు. కొలాపూర్ రాజా ఆదిత్య లక్ష్మణరావు కోట ప్రహరీ గోడ వద్ద నిర్మాణాలు చేసుకునే విధంగా స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్మారు. ఆ విధంగా చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా కూడా ప్లాట్లు కొనుగోలు చేసిన దశలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకుని ఆ స్థలం కోర్టు వివాదంలో ఉందని చెప్పారు. అయినా ఎవరూ కూడా వినకుండా నిర్మాణాలు చేశారు. ఈ దశలో స్థానిక బిజెపి నాయకులు మునిసిపల్ అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించారు. స్థానిక అధికారులు కోర్టులో ఉన్న కేసు విషయం కూడా పట్టించుకోకుండా అనుమతులు ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్టేటస్ కో ఆదేశాలు వచ్చినా కూడా ఆదివారం నాడు అంటే నేడు కూడా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు, మునిసిపల్ శాఖ స్టేటస్ కో రిపోర్టు ఉన్నా కూడా మునిసిపల్ అధికారులు తెగించి అనుమతులు ఇస్తున్నారంటే వారి వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరితో తేలాల్సి ఉంది. అయితే మునిసిపల్ అధికారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వారి ఉద్యోగాలు పణంగా పెట్టి అనుమతులు ఇస్తున్నారు.
previous post