భర్తతో విడిపోయి తన మానాన తాను బతుకుతున్న ఒక మహిళను అత్యంత కిరాతకంగా హింసించారు ఆ కుల పెద్దలు.
మధ్య ప్రదేశ్ లోని గున జిల్లా లోని సాగి, బన్స్ కేడి గ్రామాల మధ్యన ఈ దురాగతం జరిగింది. ఒక మహిళ తన భర్తతో పరస్పర అంగీకారంతో విడిపోయింది.
కాపురం చేయడానికి భర్త కూడా అంగీకరించకపోవడంతో ఆమె వేరే గ్రామానికి వెళ్లిపోయింది. అక్కడ ఒక యువకుడితో సహజీవనం చేస్తున్నది.
ఈ విషయం తెలుసుకున్న మాజీ భర్త తరపు బంధువులు ఆమె పై కక్ష పెంచుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి తమ గ్రామానికి తీసుకువచ్చిన మాజీ భర్త తరపు బంధువులు ఆమెను హింసించారు.
హింసించడమే కాకుండా తమ కుటుంబంలోని ఒకరిని ఆమె భుజాలపైన ఎక్కించి మూడు కిలోమీటర్ల దూరం మోసుకువెళ్లాలనే శిక్ష విధించారు.
భుజాలపై అతడిని ఎత్తుకుని ఆమె నడుస్తుంటే వెనుక నుంచి కర్రలతో కొడుతూ వారు పైశాచిక ఆనందం పొందారు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఒక్క సారిగా ఆందోళనలు చెలరేగాయి. దాంతో గున పోలీసులు రంగంలో దిగి ఆమె నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు.
ఆమె ఫిర్యాదు ప్రకారం తన మాజీ భర్త తరపు బంధువుల్లో నలుగురిని అరెస్టు చేశారు.