చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కుమారుడు డి.ఎ. శ్రీనివాస్ పై రాజకీయ కుట్రతో తప్పుడు ఆరోపణలు రావడాన్ని ఖండిస్తున్నట్లు చిత్తూరు బలిజ సంఘం నేతలు తెలిపారు.
ఆదివారం చిత్తూరు బలిజ సంఘం కార్యాలయంలో బలిజ సంఘం అధ్యక్షుడు ఒ.ఎం.రామదాసు, బలిజ సంఘం నేత కాజూరు బాలాజీ మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఆదికేశవులు కుటుంబం ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. వైద్య, విద్య, పారిశ్రామిక రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటున్న వారిపై తప్పుడు ఆరోపణలు రావడం శోచనీయమన్నారు. తనకు ప్రమేయం లేని కేసులో శ్రీనివాస్ ను అక్రమంగా ఇరికించారన్నారు. బెంగళూరులో ఈనెల 23న నార్కోటిక్ కంట్రోల్ బోర్డు
(ఎన్ సీబీ) అధికారులు ఎయిర్ పోర్టులో ఒక అరేబియన్ మహిళను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఆమె వద్ద 7.5 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారని కేసు నమోదు అయిందన్నారు. విచారణలో ఆమె గతంలో తాను ఇందాద్ ఖాన్ అనే వ్యక్తికి 1.5 కిలోల మాదక ద్రవ్యం ఇచ్చినట్లు తెలిపిందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్ సి బి అధికారులు అతడు ఉండే స్థలానికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ వ్యక్తి ఇందాద్ ఖాన్ ఒకప్పుడు బెంగళూరు మాల్యా ఆసుపత్రిలో పనిచేసేవాడు. ప్రస్తుతం అతడు సదాశివ నగర్ లో గెస్ట్ హౌస్ లో పని చేస్తున్నాడు. అతని ఫోన్ చేసి ట్రాక్ చేసి ఇంటరాగేషన్ చేయగా ఈ గెస్ట్ హౌస్ శ్రీనివాస్ కి సంబంధించినది అని తెలియజేయడం జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో గెస్ట్ హౌస్ ను తనిఖీ చేయగా అందులో ఎటువంటి మాదక ద్రవ్యాలు దొరకలేదు. గెస్ట్ హౌస్ యజమానిగా ఉన్న శ్రీనివాస్ ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో శ్రీనివాస్ కు ఎటువంటి ప్రమేయం లేదు. కేవలం పని మనిషి చేసిన తప్పిదానికి యజమానిని బలి చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
ఎప్పుడూ ప్రజాసేవలో ఉండే శ్రీనివాస్ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడరని ఈ సందర్భంగా బలిజ సంఘం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘ నేతలు అప్పోజీ, విశ్వనాధ్, టిక్కీ రాయల్, వరదరాజులు, బాలాజీ, రమేష్, లోకనాథం, రమణ, మోహన్, తదితరులు పాల్గొన్నారు.