సంక్షేమ వసతి గృహాలను అధికారులు తరచూ పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. అదనపు కలెక్టర్ వైరా లోని ఎస్సి సంక్షేమ బాలుర హాస్టల్, తల్లాడ లోని బిసి సంక్షేమ బాలుర హాస్టల్, కొనిజర్ల లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా విద్యాలయాల ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థుల సంఖ్య, హాజరు, భోజనం, పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. స్టడీ అవర్స్ పెంచాలని, ప్రతి విద్యార్థి పై దృష్టి పెట్టాలని, చదువులో వెనుకబడ్డ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
హాస్టళ్లలో కిచెన్, డార్మిటరీ, స్టోర్ రూమ్, టాయిలెట్ల వద్ద గల వసతులను పరిశీలించారు. స్టోర్ రూంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పు దినుసులు, వంట నూనె ఇత్యాది సరుకుల నాణ్యతను పరిశీలించారు. పిల్లలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పౌష్టికాహారం అందుతుందా లేదా, డైనింగ్, బెడ్స్ వంటి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సౌకర్యాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు ఉన్న సంబంధిత వార్డెన్ లపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులను పలకరించారు.
అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా, అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా, విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. విద్యను ఆయుధంగా మలచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితాంతం సుఖపడ వచ్చని, కుటుంబ తలరాతను మార్చే శక్తి విద్యకే ఉందని ఆయన అన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, సమయం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.