తనను పిచ్చివాడుగా చిత్రీకరిస్తూ అవసరం లేని మందులు ఇస్తున్నారని డాక్టర్ సుధాకర్ అంటున్నారు. డాక్టర్లు ఇస్తున్న మందులు వికటిస్తున్నాయని, తనకు సైడ్ ఎఫెక్ట్ వస్తున్నదని డాక్టర్ సుధాకర్ తెలిపారు. కరోనా వ్యాధిగ్రస్తులను పరీక్షలు జరిపే డాక్టర్లకు మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై ఆరోపణ చేసి సస్పెండ్ అయిన నర్సీపట్నం ఎనస్తటిస్టు డాక్టర్ సుధాకర్ ను ఆ తర్వాతి పరిణామాలతో మెంటల్ ఆసుపత్రిలో చేర్చారు.
ఈ నేపథ్యంలో ఆయన విశాఖ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్కు లేఖ రాశారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయినప్పటికీ తనకు మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని డాక్టర్ సుధాకర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చిందీ ఆ లేఖలో వివరంగా పేర్కొనడం గమనార్హం. తనకు ఇస్తున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని డాక్టర్ సుధాకర్ అంటున్నారు.
తన పెదవిపై వచ్చిన మార్పులను చూపిస్తూ తీసిన ఫొటోను లేఖకు జతచేశారు. తనను వెంటనే మరో ఆసుపత్రికి రెఫర్ చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన మాస్కుల వివాదం సహా అన్ని విషయాలను ఆ లేఖలో సవివరంగా రాశారు.