అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. పంట కోతలకు వచ్చిన కూలీలపై విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి పడ్డాయి. దాంతో ఆరుగురు కూలీలు విగతజీవులుగా మారారు. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో ఈ ఘటన జరిగింది. విద్యుత్ తీగలు తెగి పడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. కూలీలు పంట కోత పనుల్లో ఉండగా, వారిపై విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడ్డాయి. వర్షం వస్తుండగా ఇక ఇంటికి పోదాం అని కూలీలు భావించిన కాసేపట్లోనే ఈ ఘోరం జరిగిందని దర్గాహొన్నూరు మాజీ సర్పంచ్ ముక్కన్న వెల్లడించారు. ఘటన స్థలం మృతుల రోదనలతో శోకసంద్రంలా మారింది. తమ వారు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేక కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేస్తోంది.