ఈనాడు గ్రూప్ కు చెందిన అన్నదాత మాసపత్రిక మాజీ సంపాదకుడు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు (93) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన గురువారం నాడు కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.
కృష్ణా జిల్లా వీరులపాడులో 1927 ఆగస్టు 13న వాసిరెడ్డి లక్ష్మయ్య, నాగరాజమ్మ దంపతులకు ఆయన జన్మించారు. డా.నారాయణరావు 1952 నుంచి ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధకశాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. పశుసంవర్ధక శాఖ సంచాలకులుగా పని చేసి 1985లో పదవీ విరమణ చేశారు.
పనిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలనే లక్ష్యంతో విశ్రాంత జీవితంలోనూ రైతు సేవలో తరించాలని భావించి 1985 నుంచి ఈనాడు గ్రూపులో చేరారు. 1987 నుంచి 2017 అక్టోబరు వరకు మూడు దశాబ్దాల పాటు వ్యవసాయదారుల మాసపత్రిక ‘అన్నదాత’ సంపాదకులుగా సేవలు అందించారు.