ఎర్లీ బర్డ్ పథకం క్రింద 5 శాతం పన్ను రాయితీ పొందుటకు ఈ నెలాఖరు వరకే అవకాశం ఉన్నట్లు, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి అన్నారు. కమీషనర్ మున్సిపల్ కార్యాలయంలో ఎర్లీ బర్డ్ పన్ను రాయితీ వసూళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్లీ బర్డ్ పథకం పై ప్రజల్లో అవగాహన కల్పించి, ముందస్తు పన్ను చెల్లించే విధంగా చైతన్యం తేవాలన్నారు. కార్పొరేషన్ లో రూ. 30.87 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉండగా, ఎర్లీ బర్డ్ స్కీం లో 5 శాతం రాయితీతో ఇప్పటివరకు రూ. 5 కోట్ల 76 లక్ష లు వసూలు అయినట్లు అన్నారు.
రూ. 10 కోట్లు ఎర్లీ బర్డ్ క్రింద ముందస్తు పన్ను వసూలుకు లక్ష్యంగా కార్యాచరణ చేసినట్లు తెలిపారు. పన్ను వసూళ్లకు 24 మంది ప్రత్యేక అధికారులని బిల్ కలెక్టర్ కు కేటాయించడం జరిగినట్లు ఆయన అన్నారు. ప్రజలందరికీ ప్రత్యేక అధికారులు, బిల్ కలెక్టర్ కలిసి ఎర్లీ బర్డ్ క్రింద ముందస్తు పన్ను చెల్లించి 5 శాతం పన్ను రాయితీ పొందడంపై వివరించి ఈ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకునేలా చూడాలని కమీషనర్ తెలిపారు. ఈ సమావేశంలో శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ప్రత్యేక అధికారులు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.