ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వంతో అంటకాగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై సమర శంఖం పూరించనుంది. ఏపీలో జరుగుతున్న అవినీతికర కార్యకలాపాలపై చార్జిషీట్ లు దాఖలు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. అంశాల వారీ చార్జిషీట్లు రూపొందించేందుకు జాతీయ నాయకత్వం నలుగురు నేతలతో కమిటీ నియమించింది.
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్లతో కమిటి ఏర్పాటు చేసింది. మద్యం, ఇసుక, మట్టి, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ట్రాన్స్ఫార్మాస్, ఆర్డీఎస్ఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, సెంటు భూమి పథకంలో అక్రమాలు జరిగాయి.
వైజాగ్లో భూ ఆక్రమణలు, రిషికొండలో చోటు చేసుకున్న అక్రమాలు… వంటి విషయాలపై బీజేపీ కమిటీ చార్జిషీట్లు రూపొందించనుంది. బీజేపీ కమిటీ మే 5వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించనుంది. కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలు చోట్ల స్వయంగా చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు. ఐదు నెలల క్రితం… వైజాగ్లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని పార్టీ నేతలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడంతో… కమిటీ ఏర్పాటు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో విజయవాడలో ఈ కమిటీ భేటీ కానుంది.