ప్రకృతిలో ఆడా, మగా ఇద్దరూ సమానమేనని అయితే ఈ సమానత్వం కుటుంబం నుంచే ప్రారంభం కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు అన్నారు. ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పుట్టకోట లోని కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన మహిళా న్యాయ చైతన్య సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడ మగ అనే భేదం చట్టపరంగా లేదని అందరూ సమానులేనని అన్నారు. విద్యార్థి దశనుంచే ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి కృషి చేయాలని ఉద్బోధించారు. పేదరికం మనిషిని బాధ పెట్టకూడదని, ఉన్నదాంట్లో సంతృప్తి చెంది ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. సమాజంలో జీవించేటప్పుడు ఎవ్వరూ ఇతరుల వస్తువులను కానీ ధనాన్ని కానీ ఆశించవద్దని నిజాయితీగా నిలబడాలని పిలుపునిచ్చారు. విద్యాభ్యాస దశలో విద్యార్థులు మానసిక శారీరక ఆరోగ్యం పై దృష్టి సారించాలని అన్నారు. పిల్లలందరూ తల్లిదండ్రుల మాట విధిగా వినాలని తల్లిదండ్రులను మొదటి గురువులుగా భావించాలని అన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి వరకట్న నిషేధ చట్టము, బ్రూణ హత్యల నిషేధ చట్టము, అవినీతి నిరోధక చట్టం తదితరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
previous post
next post