మంత్రి పేరుతో ESI కుంభకోణం నిందితుడు ‘కార్తీక్’ దందా చేస్తున్నాడంటూ సత్యం న్యూస్ నిన్న ఒక వార్తను పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రావడంతో ESI కార్పొరేషన్ లో పని చేసే ఎంతో మంది బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
తాము ఇంత కాలంగా అనుభవిస్తున్న వేదన బయటకు వచ్చిందని సంతోషించారు. అదే సమయంలో ఇతనిపై ఎప్పటి నుంచో నిఘా వేసి ఉన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారని తెలిసింది.
ఈ విషయాలన్నీ సంబంధిత మంత్రికి కూడా తెలియడంతో తన పేరుతో దందాలు చేస్తున్న కార్తీక్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇంత కాలం మంత్రి పేరుతో దందాలు చేసిన కార్తీక్ పై మంత్రి సీరియస్ గా ఉన్నారని తెలియడంతో అతను విలాసవంతమైన ఆ హోటల్ ను ఖాళీ చేసి అజ్ఞాతం లోకి వెళ్లిపోయాడు.
ముందుగా సత్యం న్యూస్ ఇచ్చిన వార్త యథాతధంగా
‘ఈఎస్ఐ’ కుంభకోణంలో నిందితుడుగా ‘ కార్తీక్’ అనే వ్యక్తి మంత్రి పేరుతో దందా చేస్తున్నట్లు పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మంత్రితో లావాదేవీలు కలిగి ఉన్నాడు. మంత్రికి తెలిసే జరుగుతున్న ఈ వ్యవహారంలో సదరు వ్యక్తి ఇప్పటికే పలు రకాలుగా కోట్లది రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
మందుల సరఫరాదారులు, ప్రవేటు ఆసుపత్రుల నుంచి ఇతను భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. విజయవాడ ‘నోవాటేల్ ‘ కేంద్రంగా మంత్రి పేషీకి సమాంతర వ్యవస్థ ను ఈ వ్యక్తి నడుపుతున్నాడు. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ESI కుంభకోణంలో ఇతను నిందితుడు. మంత్రి, ఉన్నతాధికారులు, ఉద్యోగులు తన కనుసన్నల్లో నడుస్తారని తాను చెప్పిందే ESI లో జరుగుతుందని చెబుతూ మందుల సరఫరా దారులు, ప్రవేటు ఆసుత్రుల బిల్లుల చెల్లింపులు, టెండర్ల పేరుతో అక్రమంగా కోట్లలో వసూలు చేసినట్లు చెబుతున్నారు.
అంతేగాకుండా ESI లో తనకువ్యతిరేకంగా వ్యవహరించే అధికారులు, ఉద్యోగులపై ఎంక్వయిరీలు వేయించి సస్పైన్డ్ చేయిస్తానని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ESI లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నలుగురు ఉద్యోగులపై విచారణ చేయించి, చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించింది తానే నని ‘కార్తీక్’ ఉద్యోగులను బెదిరింపులకు పాల్పతున్నట్లు చెబుతున్నారు.
ESI కుంభకోణంలో నిందితుడుగా ఉన్న ‘కార్తీక్’ ఆ శాఖ మంత్రి కుమారుడికి బెంజి కారు బహుమతిగా ఇచ్చారని గతంలో తెలుగుదేశం పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇతని అక్రమ కార్యకలాపాలపై నిఘా వర్గాలు కూడా ఆరా తీసినట్లు సమాచారం.
మంత్రి పేరుతో దందా చేస్తున్న తెలంగాణాకు చెందిన ‘కార్తీక్ ‘ వ్యవహారాలు సదరు శాఖా మంత్రికి తెలిసే జరుగుతున్నాయా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా ఉన్నది. ఇంతే కాకుండా కార్తీక్ చేసిన అక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నట్లు తెలుస్తోంది.
కుంభకోణంలో జైలు నుంచి వచ్చిన అనంతరం విజయవాడలో ప్రముఖ హోటల్ ‘నోవాటేల్’ కేంద్రంగా గత 9 నెలల నుంచి సూట్ రూమ్ తీసుకుని ESI లో సమాంతర వ్యవస్థ నడుపుతున్నట్లు సమాచారం.