సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వేపలసింగారం గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వరసర్వే కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మంగళవారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈ సీజన్లో మలేరియా,చికెన్ గున్యా,డెంగీ వంటి వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తాయని,దోమలు వ్యాప్తి చెందకుండా, కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి పరిసరాలలో పగిలిన కుండలు,వాడిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, పాత జాడీలు వంటి వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు.
ప్రజలు రాత్రి వేళలో మస్కిటో కాయిల్స్ వెలిగించుకోవాలని,శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నేం శిరీష కొండారెడ్డి, వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ,ఉదయగిరి శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు మరియమ్మ ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.