శ్రీవారి పాదాల మండపం వద్ద శుక్రవారం తిరుపతి స్థానిక హక్కుల పోరాట సమితి మరియు టిటిడి ఉద్యోగస్తుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుపతి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని నవీన్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచిన తిరుపతి ఆవిర్భవించి నేటితో 893 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీ రామానుజాచార్యులు క్రీ”శ 1130 ఫిబ్రవరి 24న గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి నగరానికి బీజం పడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
తిరుపతి నుంచి అర్చకులు అడవి మార్గంలో తిరుమల కొండకు వెళ్లి స్వామివారికి పూజలు చేసి తిరిగి పొద్దు పొడవక ముందే కిందకు చేరుకునేవారట. శ్రీ రామానుజాచార్యుల వారు నడయాడిన పుణ్యభూమి ఆధ్యాత్మిక నగరం మన “తిరునగరి” లో శుక్రవారం జయహో రామానుజాచార్యా నినాదంతో మారు మ్రోగింది. తిరుమలలో మొట్టమొదటి శ్రీవారి దర్శనం చేసుకున్న సన్నిధి గొల్ల శ్రీ శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు.
తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఏటా టిటిడి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలన్నారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి పాదాల మండపం వద్ద గోవింద నామ స్మరణతో టెంకాయలు కొట్టి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత దినదినాభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక నగర పరపతి మరింత పెంచే విధంగా ప్రజలందరి భాగస్వామ్యంతో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించిన నిర్వాహకులకు నవీన్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు.