నకిలీ పత్రాలతో మంత్రిగా పేర్కొంటూ ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. సునీల్ సింగ్ అనే వ్యక్తి తనను తాను ఉత్తరప్రదేశ్ మంత్రిగా పేర్కొంటూ నకిలీ పత్రాలు సమర్పించి పనాజీలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బసకు దిగాడు. దీంతో గోవా ప్రభుత్వం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ను సైతం అతడికి కేటాయించింది.
సునీల్ సింగ్ గెస్ట్ హౌస్లో 12 రోజుల పాటు బస చేశాడు. ఈ క్రమంలో దక్షిణ గోవా జిల్లాలోని కనకోనా తాలుకాలో ఓ పాఠశాల ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా హాజరయ్యాడు. గోవా సహకారశాఖ మంత్రి గోవింద్ గవాడేను కలిసి సంబంధితశాఖ గురించి పలు విషయాలను చర్చించాడు. సీఎంను కలిసేందుకు సైతం అపాయిట్మెంట్ కోరాడు.
కాగా అతని ప్రవర్తనపై అనుమానం కలిగిన ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ పోలీసులను అలర్ట్ చేయడంతో గోవా క్రైం బ్రాంచ్ సీనియర్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని సునీల్ సింగ్తో పాటు అతని నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశారు. దీనిపై మంత్రి గోవింద్ గవాడేను వివరణ కోరగా సునీల్ సింగ్తో తాను 10 నిమిషాలు మాత్రమే సమావేశమైనట్లు తెలిపారు.
భేటీ అనంతరం ఇంటికి వెళ్లి ఇంటర్నెట్ సెర్చ్ చేయగా అతడి గురించి వివరాలేమి తెలియలేదన్నారు. అప్పుడే తనకు అనుమానం వచ్చినట్లుగా చెప్పారు. కాగా పని బీజీలో ఆ విషయం గురించి పట్టించుకోలేదన్నారు.