ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాకు 14555 డబల్ బెడ్ రూం మంజూరు కాగా, 8956 ఇండ్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశామన్నారు. 7784 ఇండ్లకు టెండర్లు ఖరారు కాగా, 7023 ఇండ్ల పనులు ప్రారంభించినట్లు, 4455 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 3965 ఇండ్లను లబ్ధిదారులకు ఆందజేసినట్లు, 881 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు. 761 ఇండ్ల నిర్మాణాలు ఇంకనూ ప్రారంభం కాలేదని, పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.
బ్లాకుల వారీగా నిర్మాణాలు, సౌకర్యాలకల్పనపై దృష్టి పెట్టాలన్నారు. నిర్మాణాలు పూర్తయిన చోట విద్యుద్దీకరణ, సానిటరీ, సంప్, డ్రైన్స్ నిర్మాణం, సీవరేజ్, సెప్టిక్ ట్యాoకుల నిర్మాణాలు, అంతర్గత రహదారులు, అప్రోచ్ రోడ్ లపై దృష్టి పెట్టి వెంటనే పూర్తి చేయాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో శిరీష, ఆర్ అండ్ బి, పీఆర్, టీఎస్ ఇడబ్ల్యుఐడిసి, మిషన్ భగీరథ, ట్రైబల్ శాఖల ఇఇ లు శ్యామ్ ప్రసాద్, శ్రీనివాసరావు, చంద్రమౌళి, నాగశేషు, పుష్పలత, తానాజి, వివిధ శాఖల డిఇ లు, ఏ ఇ లు తదితరులు పాల్గొన్నారు.