బెంగళూరులో విపక్ష పార్టీ నేతలు సమావేశమైన వేళ ప్రధాని నరేంద్ర మోడీ విపక్ష కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల వైఖరి ‘ఫ్యామిలీ ఫస్ట్.. నేషనల్ నథింగ్’ అనేలా ఉందని ధ్వజమెత్తారు. అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్లోని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత లాభం కోసమే విపక్షాలు పని చేస్తున్నాయని, గతంలో దేశంలోని పేదల గురించి ఏనాడు ఆలోచించకుండా స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు.తమ కుటుంబ పాలనను కాపాడుకోవడమే వారి పని అని, కుటుంబ పాలనను కాపాడుకునేందుకు విచ్చలవిడి అవినీతిని పెంచిపోషించారన్నారు.
గడిచిన 9 ఏళ్లలో యూపీఏ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దామన్నారు. 2024లో ప్రజలు మరోసారి బీజేపీనే గెలిపించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని దీంతో విపక్షాలు తమ దుకాణాన్ని తెరిచాయని ధ్వజమెత్తారు. పైకి మరోలా చెబుతున్నా వారి దుకాణాల్లో మాత్రం కులతత్వ విషం, అపారమైన అవినీతి దొరుకుతుందని ఆరోపించారు.
బెంగళూరులో జరుగుతున్న విపక్షాల భేటీ ‘అవినీతి పరుల శిఖరాగ్ర సదస్సు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దేశాభివృద్ధిని ఆపడమే విపక్షాల మినిమమ్ కామన్ ప్రోగ్రామ్ అని విమర్శించారు. అవినీతిని అడ్డుకునే చర్యలకు విపక్షాలు అడ్డుపడుతున్నాయని పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తమ కార్యకర్తలను సైతం గాలికి వదిలేసి టీఎంసీతో జట్టు కలిశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబ పార్టీలు యువత కోసం ఏనాడు ఆలోచన చేయలేదని కేవలం తమ కుటుంబ పాలనను కాపాడుకోవడం పైనే దృష్టి పెట్టాయన్నారు. కాగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఉమ్మడి కార్యాచరణపై దృష్టి సారించిన నేపథ్యంలో మోడీ విపక్షాలను టార్గెట్ చేయడం రాజకీయం మరింత వేడెక్కింది.